1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (14:13 IST)

అమెరికాపై దాడులు చేస్తే.. ఇరాన్ సంగతి తేల్చేస్తాం.. ట్రంప్ గట్టి వార్నింగ్

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్ అమెరికన్లపై గాని, వారి ఆస్తులపై గాని దాడులు చేస్తే ఇరాన్‌లోని 52 ప్రాంతాల్లో చాలా వేగంగా, తీవ్రమైన దాడులు చేస్తామని ట్విట్టర్ వేదికగా ట్రంప్ హెచ్చరించారు. అమెరికా 52 సంఖ్యను ఎంచుకోవడం వెనుక కారణం కూడా చెప్పారు. 1979లో ఇరాన్ లోని అమెరికా రాయభార కార్యాలయంలో 52 మంది అమెరికన్లను ఏడాదికి పైగా నిర్బంధించారు. దీంతో ఆయన ఆ సంఖ్యను ఎంచుకున్నారు. 
 
అంతేకాదు… తాను ఎంచుకున్న 52 ప్రాంతాలు ఇరాన్‌కు ఉన్నతమైనవి, చాలా కీలకమైనవి, ఇరాన్ సంస్కృతి పరంగా కూడా తమ లక్ష్యాల్లో ఇరాన్ వుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా ఇంకా ఏ మాత్రం బెదిరింపులు కోరుకోవడం లేదని ట్రంప్ ట్వీట్ చేశారు.
 
ఇరాన్‌లో అత్యంత శక్తివంతుడైన సైనికాధిపతి జనరల్ ఖాసీం సులేమాన్ ను ఇరాక్ లో అమెరికా దళాలు మట్టుబెట్టిన తర్వాత ఇరాక్ లోని అమెరికన్లపై, అమెరికా సంస్థలపై ఒత్తిడి పెరిగింది. వారిని చంపేస్తామంటూ…వారి సంస్థలపై దాడులకు హెచ్చరికలు చేస్తున్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అమెరికా రాయభార కార్యాలయం సమీపంలో శనివారం రెండు మోర్టార్ దాడులు జరిగాయి. 
 
ఇది గాక అమెరికా భద్రతా దళాలు మోహరించిన అల్ బలాద్ ఎయిర్ బేస్ లో రెండు రాకెట్ దాడులు జరిగాయి. ఈ రెండు దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాక్‌లో ఉన్న అమెరికన్లు ఎప్పుడు తమపై దాడులు జరుగుతాయోనని భయాందోళనలో ఉన్నారు. దీంతో ట్రంప్ బహిరంగ హెచ్చరిక చేశారు.