హెచ్1బీ వీసాలపై ఆసక్తి చూపించని భారతీయ టెక్ కంపెనీలు
అమెరికా ప్రభుత్వం జారీ చేసే హెచ్-1బీ వీసాలపై భారతీయ టెక్ కంపెనీలు గత కొంతకాలంగా పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒకప్పుడు ఈ వీసాలను అత్యధికంగా వినియోగించుకున్న భారతీయ ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఇప్పుడు వాటిపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించాయి.
మరోవైపు, అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలే ఇప్పుడు హెచ్-1బీ వీసాలను ఎక్కువగా పొందుతున్నాయి. ఈ మార్పు గత ఎనిమిదేళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ ఏపీ) నివేదిక వెల్లడించింది.
ఎన్ఎఫ్ఎపీ గణాంకాల ప్రకారం, ఏడు ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాల కోసం సమర్పించే దరఖాస్తుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. 2015లో ఈ కంపెనీలు సుమారు 15,100 దరఖాస్తులు చేయగా, 2022-23 నాటికి ఆ సంఖ్య కేవలం 6,700కు పడిపోయింది. అంటే, గత ఎనిమిది సంవత్సరాలలో దరఖాస్తులు ఏకంగా 56 శాతం తగ్గాయి.
ఒకప్పుడు హెచ్-1బీ వీసాలను ఎక్కువగా స్పాన్సర్ చేసిన ఓ ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ, ఇదేకాలంలో తన వీసా ఆమోదాలను 75 శాతం వరకు తగ్గించుకోవడం గమనార్హం. ఇది భారతీయ కంపెనీల వ్యూహంలో వచ్చిన మార్పును సూచిస్తోంది.
దీనికి పూర్తిభిన్నంగా, అమెరికన్ టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాలను పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఐదు ప్రముఖ అమెరికన్ ఐటీ కంపెనీలే దాదాపు 28,000 హెచ్-1బీ వీసా ఆమోదాలు పొందాయని నివేదిక పేర్కొంది. విదేశీయులు తమ ఉద్యోగాలు లాక్కుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో, ఈ గణాంకాలు హెచ్-1బీ వీసాల వినియోగంలో అసలు ట్రెండ్ను స్పష్టం చేస్తున్నాయి.