1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (08:38 IST)

చైనా ఉత్పుత్తులను బహిష్కరించాల్సిందే.. ఊపందుకున్న ఉద్యమం

లడఖ్ ప్రాంతలోని గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులను అతి క్రూరంగా చంపిన చైనాకు తగిన గుణపాఠం చెప్పాలంటూ దేశంలోని ప్రతి పౌరుడూ డిమాండ్ చేస్తున్నాడు. ఇందులోభాగంగా, చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా చైనా ఉత్పత్తుల బహిష్కరణపై ఓ ఉద్యమం కూడా కొనసాగుతోంది. ఇది రోజు రోజుకూ ఊపందుకుంటోంది. 
 
ఒకవైపు, చైనా జవాన్లు పాల్పడిన దుశ్చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు గళమెత్తుతుంటే, మరోవైపు, 20 మంది సైనికులను హత్య చేసినందుకు ప్రతీకారంగా చైనా ఉత్పత్తులను వాడకూడదన్న డిమాండ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 
 
ఈ విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టయితే, చైనా ఏకంగా రూ.1.29 లక్షల కోట్ల వ్యాపారాన్ని కోల్పోయే అవకాశం ఉంది. చైనా నుంచి భారత్‌ ఏటా రూ.5.65 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. 
 
ఈ మొత్తం దిగుమతుల్లో చిల్లర వ్యాపారులు రూ.1.29 లక్షల కోట్ల విలువైన వస్తువులను విక్రయిస్తారు. వీటిలో ప్రధానంగా బొమ్మలు, ఆటవస్తువులు, గృహోపకరణాలు, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రిక్‌, ఎలకా్ట్రనిక్‌ వస్తువులు ఉన్నాయి. 
 
అయితే, గల్వాన్‌ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం చైనా ఉత్పత్తుల స్థానంలో భారతీయ వస్తువులను విక్రయించాలని జాతీయ వ్యాపార సంస్థ నిర్ణయించింది. అతేకాకుండా, చైనా నుంచి వస్తువుల దిగుమతిని నిలిపివేయాలని తాజాగా 'అఖిల భారత వ్యాపార్‌ మండలి సమాఖ్య' (ఎఫ్‌ఏఐవీఎం) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 
 
ఇకపై డ్రాగన్‌ వస్తువుల కొనుగోలుకు ఆర్డర్లు ఇవ్వకూడదని మండలి ప్రధాన కార్యదర్శి వీకే బన్సాల్‌ వ్యాపారులకు సూచించారు. చైనా వస్తువులను విక్రయించరాదని వ్యాపారులకు తెలియజేశామని పశ్చిమ బెంగాల్‌ వ్యాపారుల సంఘ సమాఖ్య అధ్యక్షుడు సుశీల్‌ తెలిపారు. 
 
రైల్వేలో ఇక మేడిన్‌ ఇండియా పరికరాలే వాడతామని రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. తాము తయారుచేసిన ఉత్పత్తులను ఎగుమతి అయ్యేలా ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు. రైల్వే టెండర్లలో పాల్గొనడానికి దేశీయ బిడ్డర్లకే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. 
 
అలాగే, చైనాపై ఆధారపడకూడదని, దేశీయంగా వస్తువులను ఉత్పత్తి చేయడానికి పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి గడ్కరీ పిలుపునిచ్చారు. ఈ దిశగా కేంద్ర సర్కారు కృషి చేస్తుందని ఆయన తెలిపారు.