1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (11:20 IST)

సరిహద్దుల్లో కలకలం రేపిన పాక్ డ్రోన్ - కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్

కయ్యాల మారి పాకిస్థాన్ నిరంతరం సరిహద్దుల్లో ఏదో కలకలం రేపుతూనేవుంది. మొన్నటి సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలను భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. అలాగే, కాల్పుల ఉల్లంఘనకు తూట్లు పొడిచింది. ఇపుడు జమ్మూ కాశ్మీర్‌లోని రణబీర్‌ సింగ్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్‌కు చెందిన డ్రోన్‌ కలకలం రేపింది. 
 
డోన్ల సాయంతో భారత సరిహద్దుల్లోని పరిస్థితులను తెలుసుకునేందుకు పాక్ చేస్తోన్న ప్రయత్నాలను సరిహద్దు భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా, ఓ డ్రోన్ కనపడడంతో వెంటనే అప్రత్తమైన భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ తిరిగి అక్కడి నుంచి పాక్‌లోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.
 
ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. పాక్ పదే పదే ఈ చర్యలు పాల్పడుతోందని, గత నెల 21న మెన్దార్‌ సెక్టార్‌లోనూ డ్రోన్ కదలికలను గుర్తించి, ధీటుగా సమాధానం చెప్పామని తెలిపారు. అంతకుముందు సెప్టెంబరులోనూ సాంబా సెక్టార్‌ వద్ద రెండు పాక్ డ్రోన్లు తిరుగుతుండగా బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు.