శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (19:25 IST)

రోదసీలోకి మరో కోటీశ్వరుడు... జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు సర్వంసిద్ధం

మున్ముందు వాణిజ్యపరమైన అంతరిక్ష ప్రయాణం మరింత సులభతరంకానుంది. ఇప్పటివరకు చేపట్టిన అంతరిక్ష ప్రయాణ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. దీంతో ఇపుడు మరో కోటీశ్వరుడు రోదసిలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన ఎవరో కాదు.. అమెజాన్, బ్లూ ఆరిజన్ అధిపతి జెఫ్ బెజోస్. ఈ కోటీశ్వరుడి రోదసీ యాత్రకు సర్వం సిద్ధమైంది. 
 
అమెరికా అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్, మరో ముగ్గురి అంతరిక్ష విహారానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. వచ్చే మంగళవారం వీరు పశ్చిమ టెక్సాస్‌ నుంచి ‘న్యూ షెపర్డ్‌’ రాకెట్‌ ద్వారా ‘సబ్‌ ఆర్బిటల్‌’ యాత్ర చేసి వస్తారు. ఇందులో బెజోస్, ఆయన సోదరుడు, 82 ఏళ్ల వయసున్న ఏవియేషన్‌ నిపుణురాలు, 2.8 కోట్ల డాలర్ల వేలంలో విజేతగా నిలిచిన వ్యక్తి పాల్గొంటారు. ప్రయాణికులతో బ్లూ ఆరిజిన్‌ సంస్థ వ్యోమనౌక యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. 
 
గత ఆదివారం వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన వీఎస్‌ఎస్‌ యూనిటీ-22లో ఆ సంస్థ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సన్, తెలుగు అమ్మాయి బండ్ల శిరీష, మరో నలుగురు రోదసిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వీరు నేల నుంచి దాదాపు 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లారు. 
 
ఈ బ్లూ ఆరిజిన్‌కు చెందిన న్యూ షెపర్డ్‌ వ్యోమనౌక మాత్రం దాదాపు 106 కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. తద్వారా రోదసి నిర్వచనానికి సంబంధించి అంతర్జాతీయంగా ఆమోదం పొందిన ప్రాంతం కన్నా ఎగువకు వెళ్లినట్లవుతుందని ఆ సంస్థ చెబుతోంది. 
 
ఈ వ్యోమనౌకను పునర్‌వినియోగ బూస్టర్‌ ద్వారా రోదసిలోకి పంపుతారు. యాత్ర అనంతరం అది పారాచూట్‌ సాయంతో ఎడారిలో దిగుతుంది. అంతరిక్ష యాత్రల్లో బ్లూ ఆరిజిన్, వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థలు పోటీపడుతున్నాయి. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ కూడా బరిలోకి దిగుతోంది.