గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (23:06 IST)

కలిసుందాం రా: బైడెన్ కు చైనా పిలుపు

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, చైనాల మధ్య దిగజారిన సంబంధాలను పునరుద్ధరించేందుకు కొత్తగా తిరిగి చర్చలు ప్రారంభిద్దామని కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్‌ ప్రభుత్వాన్ని చైనా కోరింది. చైనాపై కత్తిగట్టిన ట్రంప్‌ ప్రభుత్వం ఆ దేశంపై ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తోంది.

వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో చైనాను దెబ్బతీసే ఉద్దేశంతో తీవ్ర ఆంక్షలను విధించింది. అమెరికా తన ప్రపంచాధిపత్యాన్ని కొనసాగించేందుకు చైనాను అడ్డంకిగా భావిస్తున్నది. దక్షిణ చైనా సముద్ర దీవుల్లో చిచ్చు పెట్టాలని చూడడం, హాంకాంగ్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోయడం, కమ్యూనికేషన్‌ రంగంలో చైనీస్‌ దిగ్గజం హువావెయిపై అమెరికాలో ఆంక్షలు విధించడం, చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుల ప్రవేశంపై ఆంక్షలు విధించడం వంటివి చేసింది.

దీనికి చైనా కూడా దీటుగానే బదులిచ్చింది. ప్రపంచానికి ట్రంప్‌ పీడ విరగడ అయి కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో ఇరు దేశాలు కలసి పనిచేద్దామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ సోమవారం జరిగిన అమెరికా-చైనా బిజినెస్‌ కౌన్సిల్‌ (యుఎస్‌సిబిసి) బోర్డు ఆన్‌లైన్‌ సమావేశంలో చెప్పారు.

ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ తన వైబ్‌సైట్‌లో తెలిపింది. సమస్యలు వెంటనే పరిష్కారం కాకపోయినా, ఇరు దేశాల మధ్య సంబంధాలు మున్ముందు మరింత దిగజారకుండా చూసేందుకు నిర్మాణాత్మక వైఖరిని కొనసాగించడం అవసరమని వాంగ్‌ యి పేర్కొన్నారు.