1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (17:31 IST)

ఇద్దరు జర్నలిస్టులకు నోబెల్ శాంతిపురస్కారం

నోబెల్ శాంతి పురస్కారం ఈ యేడాది ఇద్దరు జర్నలిస్టులకు వరించింది. వారిలో ఒకరు అమెరికా జర్నలిస్టు కాగా, మరొకరు రష్యా జర్నలిస్టు. వీరిద్దరినీ 2021 సంవత్సరానికిగాను శాంతి పురస్కారం వరించింది. ఈ పురస్కారం వరించిన వారిలో ఒకరు మారియా రెస్సా, రెండో జర్నలిస్టు పేరు ద్మిట్రీ మరటోవ్‌లు ఉన్నారు. సుస్థిర ప్రజాస్వామ్యానికి, చిరకాల శాంతికి భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యమే పునాది అని బలంగా నమ్మి ఈ ఇద్దరు జర్నలిస్టులు ఆచరించారని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. 
 
కాగా, మారియా రెస్సా ఫిలిప్పినో ఓ అమెరికన్ జర్నలిస్ట్. సీఎన్ఎస్ ఆగ్నేయాసియా విభాగంలో 20 ఏళ్ల పాటు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వ్యక్తి వాక్ స్వేచ్ఛను అనేక వేదికలపై నిర్భయంగా చాటారు. ఫిలిప్పీన్స్ చట్టాల ప్రకారం అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎక్కడా బెదరలేదు. ఓసారి అరెస్ట్ అయ్యారు. అప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాలపైనే నిలబడ్డారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే విమర్శకుల్లో మారియా రెస్సా ముందువరుసలో ఉంటారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్‌పైనా పోరాటం సాగించారు.
 
మరోవైపు, ద్మిట్రీ మరటోవ్ అనే జర్నలిస్టు రష్యా జాతీయుడు. నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. రష్యా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలోనూ, మానవ హక్కుల ఉల్లంఘనలపై నిలదీయడంలోనూ మంచి గుర్తింపు ఉంది. 
 
ఇప్పటి ప్రపంచంలోనూ పాత్రికేయ విలువలు, మూలాలకు కట్టుబడిన మరటోవ్ 2007లో ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు, 2010లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి లెజియన్ ఆఫ్ ఆనర్ ఆర్డర్ పురస్కారం అందుకున్నారు.