1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (16:21 IST)

ఉత్తర కొరియా అధ్యక్షుడు 'కిమ్' సంచలన నిర్ణయం

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అణ్వాయుధ పరీక్షలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే అణ్వాయుధ, ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తే అది అమెరికాకు ఆగ్రహం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి పరీక్షలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అణు పరీక్షలపై తాము విధించుకున్న స్వీయ నిషేధంతో ఇక ఎలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ మధ్య అణ్వాయుధ నిరాయుధీకరణ ప్రధానాంశంగానే ఇప్పటివరకు చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో కొంత మేరకే పురోగతి నమోదయింది. అమెరికా తమపై విధించిన ఆంక్షలను సడలించాలని డిమాండ్ చేస్తూ 2019 చివరినాటికి గడువు విధించింది కిమ్ ప్రభుత్వం.

అయితే అగ్రరాజ్యం దీనిపై ఎలాంటి జవాబివ్వని కారణంగానే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిషేధం ఎత్తేస్తున్నట్లు ఉత్తరకొరియా ప్రకటన నేపథ్యంలో ట్రంప్ తలే లక్ష్యంగా కిమ్ గురిపెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ చర్యలు కిమ్కే ప్రమాదంగా మారే అవకాశాలున్నాయంటున్నారు. గతంలో అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగలిగే సామర్థ్యమున్న ఆరు అణ్వాయుధ పరీక్షలను నిర్వహించింది కొరియా దేశం. అయితే క్షిపణి పరీక్షలను నిర్వహించబోమని కిమ్ మాట ఇచ్చారంటూ ట్రంప్ పదేపదే గుర్తుచేస్తున్నారు. కానీ వాస్తవంగా ఏదైనా క్షిపణి పరీక్ష చేపడితే.. బదులుగా డొనాల్డ్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది.