1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:40 IST)

చార్జీలు తగ్గించాలంటూ తాలిబన్ల హుకుం .. నిలిచిన పాక్ ఫ్లైట్ సర్వీసులు

తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్ దేశ రాజధాని కాబూల్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం నడుపుతూ వచ్చిన విమాన సేవలను నిలిపివేసింది. విమాన చార్జీలను తగ్గించాలని లేనిపక్షంలో నిలిపివేస్తామని తాలిబన్ పాలకులు పాకిస్థాన్‌ను హెచ్చరించారు. దీంతో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఊహించని నిర్ణయం తీసుకుంది. కాబూల్‌కు నడుపుతున్న అన్ని రకాల విమాన సర్వీసులను నిలిపివేసింది. 
 
టికెట్ ధరలను తగ్గించాలని, లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని ఆఫ్ఘన్‌లోని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి ముందు అంటే ఆగస్టు 15 వరకు కాబూల్ - ఇస్లామాబాద్ మధ్య టికెట్ ధర 120-150 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడది 2500 డాలర్లుగా ఉంది.
 
ఈ నేపథ్యంలో మునుపటి ధరలతో విమాన సర్వీసులను నడపాలని తాలిబన్లు ఆదేశించారు. టికెట్ ధరలను తగ్గించలేని పీఐఏ విమాన సర్వీసులను రద్దు చేసింది. తాము మానవతా దృక్పథంతోనే విమాన సర్వీసులు నడుపుతున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. 
 
బీమా సంస్థలు కాబూల్‌ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున బీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని, అందుకనే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. మరోవైపు, తమ సిబ్బందిని తాలిబన్లు భయపెడుతున్నారని పీఐఏ ఆరోపించింది.