1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (19:13 IST)

ఆప్ఘనిస్థాన్‌కు పాకిస్థాన్: కాబూల్‌కు విమాన సర్వీసులు కట్

ఆప్ఘనిస్థాన్‌కు పాకిస్థాన్ షాకిచ్చింది. ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) గురువారం ప్రకటించింది. తాలిబన్ల అతి జోక్యమే దీనికి కారణమని ఆరోపించింది. 
 
అమెరికా బలగాల ఉపసంహరణ నేపథ్యంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో ఆగస్ట్‌ 31 నుంచి ఆ దేశానికి అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 
 
అనంతరం కొన్ని రోజుల తర్వాత నుంచి పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) మాత్రమే కాబూల్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగిస్తున్నది. కాబూల్‌లోని విదేశీ, చారిటీ సంస్థల సిబ్బంది తరలింపునకు సహకరిస్తున్నది.
 
అయితే విమాన ఛార్జీలను తగ్గించాలని, తమ స్వాధీనానికి ముందు నాటి రేట్లను కొనసాగించాలని తాలిబన్ ప్రభుత్వం పీఐఏను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం ఏకపక్షంగా నియమాలను మార్చుతుందని, తమ సిబ్బందిని బెదిరిస్తున్నదని పీఐఏ ఆరోపించింది. 'తాలిబన్‌ అధికారుల జోక్యం తీవ్రత కారణంగా ఈ రోజు నుండి కాబూల్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాం' అని గురువారం అధికారికంగా ప్రకటించింది.