1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మే 2023 (13:40 IST)

పాకిస్థాన్ విమానాన్ని సీజ్ చేసిన మలేషియా అధికారులు.. ఎందుకని?

pakistan airlines
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న పాకిస్థాన్‌కు మలేషియా ప్రభుత్వ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. పాకిస్థాన్ విమానయాన సంస్థ పీఐఏకు చెందిన బోయింగ్ 777 రకం విమానాన్ని సీజ్ చేశారు. ఈ విమానాన్ని లీజుపై మలేసియా నుంచి పీఐఏ తీసుకొంది. కానీ, లీజు బకాయి 4 మిలియన్‌ డాలర్లకు చేరడంతో మంగళవారం ఈ విమానాన్ని కోర్టు ఆదేశాల మేరకు కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీజ్‌ చేశారు. 
 
వాస్తవానికి లీజ్‌ విషయంలో వివాదం కూడా ఉంది. ఈ విమానం తనదేనని ఎయిర్‌ క్రాఫ్ట్‌ లీజింగ్‌ కంపెనీ వాదిస్తుండగా.. పీఐఏ మాత్రం విమానం ఇంజిన్లలో ఒకటి మాత్రమే లీజింగ్‌ కంపెనీకి చెందుతుందని పేర్కొంది. దీంతోపాటు తాము కేవలం 1.8 మిలియన్‌ డాలర్లు మాత్రమే బకాయి ఉండగా.. దానిని కూడా ఇటీవల చెల్లించినట్లు పీఐఏ ప్రతినిధి హఫీజ్‌ ఖాన్‌ చెబుతున్నారు. 
 
ఈ విమానాన్ని 2021లో కూడా ఒక సారి మలేసియా అధికారులు లీజ్‌ విషయమై సీజ్‌ చేశారు. కానీ, ఆ తర్వాత బకాయిల చెల్లింపులపై పాకిస్థాన్‌ దౌత్యపరమైన హామీ ఇవ్వడంతో వదిలిపెట్టారు. దీంతో అప్పట్లో 173 మంది ప్రయాణికులు, సిబ్బందితో విమానం పాక్‌కు తిరిగి వెళ్లింది. తాజాగా విమానాన్ని సీజ్‌ నుంచి విడిపించడానికి కౌలాలంపుర్‌లోని న్యాయ సహాయ బృందాలతో పాక్‌ అధికారులు చర్చలు మొదలుపెట్టినట్లు డాన్‌ పత్రిక పేర్కొంది.