1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (15:10 IST)

మహిళల వస్త్రధారణపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెత్త కామెంట్స్

మహిళల వస్త్ర ధారణపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ధరించే వస్త్రాల కారణంగానే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. తమ శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తే ఎవరు మాత్రం చలించకుండా ఉండరంటూ ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఇమ్రాన్‌ కామెంట్ చేశారు. రోబోల్లాంటి పురుషులే చలించకుండా ఉండగలరన్నారు. మనం నివసిస్తున్న సమాజం పూర్తిగా భిన్నమైనదని, ఇక్కడ ఎలా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం మనకే ఉండాలన్నారు. 
 
దీంతో ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు కూడా మండిపడుతున్నారు. పాకిస్తాన్‌లో పెరిగిపోతున్న అఘాయిత్యాలతో మహిళల వస్త్రధారణను ముడిపెట్టడం దారుణమని ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ జూరిస్ట్స్‌ లీగల్ అడ్వైజర్‌ రీమా ఒమర్‌ అన్నారు. 
 
ఇమ్రాన్‌ ప్రేలాపనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో ఆయన సోషల్‌ మీడియా తప్పును సరిదిద్దే పనిలో పడింది. ఇమ్రాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారని సోషల్‌ మీడియా వ్యవహారాలు చేసే అధికార ప్రతినిధి డాక్టర్‌ అర్‌ స్లాన్‌ ఖాలిద్‌ చెప్పుకొచ్చారు. ఇమ్రాన్‌ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా చెప్పకుండా ఆయన ప్రసంగంలోంచి ఒక్క వాక్యాన్ని మాత్రమే కట్‌ చేసి రాద్దాంతం సృష్టిస్తున్నారని అన్నారు. 
 
మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో.. లైంగిక వాంఛలు ఏ స్థాయికి వెళ్లాయో మాత్రమే ఇమ్రాన్‌ చెప్పారని, మహిళల వస్త్రధారణపై ఆయన తప్పుగా మాట్లాడలేదని ఖాలిద్‌ అన్నారు. మొన్న ఏప్రిల్ లోనూ ఇమ్రాన్ ఇంచుమించు ఇలాంటి మాటలే మాట్లాడి చులకన అయ్యారు.
 
అలాగే, ఇమ్రాన్ ఖాన్ మ‌రోసారి కాశ్మీర్ స‌మ‌స్య‌పై స్పందించారు. ఒక‌సారి క‌శ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే, అప్పుడు రెండు దేశాలు అణ్వాయుధాల‌ను పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. పాకిస్థాన్‌లో అత్యంత వేగంగా అణ్వాయుధాల‌ను స‌మీక‌రిస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ నివేదిక‌లు చెబుతున్నాయ‌ని, ఎందుకు అలా జ‌రుగుతున్న‌ట్లు ఓ జ‌ర్న‌లిస్టు పాక్ ప్ర‌ధానిని ప్ర‌శ్నించారు. 
 
ఆ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ ఇంటెలిజెన్స్‌కు ఎక్క‌డ నుంచి స‌మాచారం వ‌స్తుందో త‌న‌కు తెలియ‌ద‌ని, పాకిస్థాన్ అణ్వాయుధాలు కేవ‌లం ర‌క్ష‌ణ కోసం మాత్ర‌మే అన్నారు. అణ్వాయుధాలు పెరుగుతున్నాయ‌న సంఖ్య త‌న‌కు తెలియ‌ద‌న్నారు.
 
అణ్వాయుధాల‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని, ఇండియాతో మూడు సార్లు యుద్ధం జ‌రిగింద‌ని, అణ్వాయుధ సామ‌ర్థ్యం పెరిగిన త‌ర్వాత త‌మ మ‌ధ్య యుద్ధాలు జ‌ర‌గ‌లేద‌ని, కేవ‌లం స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌లు మాత్ర‌మే ఉన్నాయ‌ని ఇమ్రాన్ అన్నారు. 
 
ఒక‌సారి క‌శ్మీర్‌లో సెటిల్మెంట్ స‌మ‌స్య తీరితే, అప్పుడు రెండు పొరుగు దేశాల్లోని ప్ర‌జ‌లు నాగ‌రికుల్లా జీవిస్తార‌న్నారు. అప్పుడు అణ్వాయుధాలు అవ‌స‌రం ఉండ‌ద‌ని పాక్ ప్ర‌ధాని తెలిపారు.