శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జులై 2021 (18:37 IST)

తాలిబన్లు కూడా సాధారణ పౌరులే.. వారిని ఎలా చంపుతాం.. ఇమ్రాన్ ఖాన్

తాలిబన్లు కూడా సాధారణ పౌరులే..వారిని ఎలా చంపుతాం.. వాళ్లు కూడా మామూలు మనుషులే' అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు మిలిటరీ కాదు. అలాంటి వాళ్లను పాకిస్థాన్ ఎలా అంతమొందించగలదు? అంటూ ప్రశ్నించారు. 
 
తాలిబన్లకు పాకిస్థాన్ రక్షణ కల్పిస్తోందని ఆరోపిస్తున్నారు. వారి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి?అనే విషయాన్ని వారు ఎందుకు రుజువు చేయరు? పాకిస్థాన్‌-ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో 30 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఉన్నారు. ఇక తాలిబన్లు కూడా సాధారణ పౌరులే. వారేమీ మిలిటరీ కాదు. ఈ శిబిరాల్లో అటువంటి కొందరు పౌరులు ఉంటే.. వాళ్లను పాకిస్థాన్ ఎలా ఏరివేయగలదు అని ఇమ్రాన్ ప్రశ్నించారు. 
 
తాలిబన్లకు పాకిస్థాన్ ఆర్థికంగా సాయం చేస్తోందని, ఆయుధాలు సమకూరుస్తోందన్న ఆరోపణలను ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఆరోపణలకు పాక్ ఎప్పటికీ సహించదు..ఇటువంటి అవాస్తవ ఆరోపణలు చాలా అన్యాయం అని అన్నారు.
 
ఈ సందర్భంగా ఇమ్రాన్ అమెరికాపై ఎగిరిపడ్డారు. తప్పంతా అమెరికాదే అంటూ ఆరోపించారు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత తాము అమెరికాకు సాయం చేశామని, ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమవంతు కృషి చేశామని ఈ విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 
 
ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సైన్యాన్ని దింపి పెద్ద తప్పు చేసిందని ఇమ్రాన్ అన్నారు. పై చేయి ఉన్నప్పుడే తాలిబన్లతో రాజకీయ పరిష్కారం చేయకుండా..అమెరికా మధ్యలోనే వదిలేసిందని ఆరోపించారు.