1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జులై 2020 (09:05 IST)

టిక్ టాక్ మాకూ వద్దూ.. నిషేధించండి.. అమెరికాలో ప్రజాప్రతినిధుల డిమాండ్

చైనా కేంద్రంగా పని చేసే టిక్ టాక్ యాప్‌తో పాటు... 59 మంది యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. గాల్వాన్ లోయలో చైనా బలగాలు జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి నిరసనగా చైనా వస్తువులపై నిషేధం విధించాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా పుట్టుకొచ్చింది. ఈ క్రమంలో 59 సోషల్ మీడియా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఇపుడు అమెరికాలోనూ టిక్ టాక్‌ను నిషేధించాలంటూ అక్కడి ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ యాప్ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని, కాబట్టి వీలైనంత త్వరగా దీనిని నిషేధించాలని కోరుతున్నారు. టిక్‌టాక్ యాప్‌ను నిషేధించిన భారత్‌కు మద్దతుగా సెనేటర్ జాన్ కోర్నిన్ ట్వీట్ చేయగా, అమెరికా ఇప్పటికే దీనిని నిషేధించి ఉండాల్సిందని రిపబ్లికన్ ప్రతినిధి రిక్ క్రాఫోర్డ్ అభిప్రాయపడ్డారు. 
 
కాగా, అమెరికాలో నాలుగు కోట్ల మంది టిక్‌టాక్‌ను వాడుతున్నారు. వీరిలో ఎవరైనా చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీపై వ్యాఖ్యలు చేస్తే యాప్ అసంకల్పితంగానే దానిని డిలీట్ చేస్తోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్ పేర్కొన్నారు.
 
ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్ వాడకాన్ని నిషేధించాలటూ రూపొందించిన రెండు బిల్లులు అమెరికన్ కాంగ్రెస్‌లో పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ యాప్‌ను నిషేధించాలన్న డిమాండ్‌ను అమెరికా అధ్యక్షుడి వాణిజ్య వ్యవహారాల సలహాదారు పీటర్‌ నవరో కూడా సమర్థించడం గమనార్హం.