డబ్బు కోసం ఆరేళ్ల కుమార్తెను విక్రయించి పెళ్లి జరిపించిన తండ్రి... ఎక్కడ?
తాలిబన్ పాలనలో ఉన్న ఆప్ఘనిస్థాన్లో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. డబ్బు కోసం ఆరేళ్ల బాలికను ఓ కసాయి తండ్రి.. ఓ వ్యక్తికి విక్రయించి, వివాహం కూడా జరిపించాడు. తాజాగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సౌత్ ఆప్ఘనిస్థాన్లోని మర్జా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వివరాలను పరిశీలిస్తే, మర్జా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పేదరికం కారణంగా తన ఆరేళ్ల కుమార్తెను 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇప్పటికే ఇద్దరు భార్యలున్న ఆ వ్యక్తి, బాలిక కుటుంబానికి కొంత డబ్బు చెల్లించి ఈ పెళ్లికి ఒప్పించినట్లు అమెరికాకు చెందిన అము.టీవీ అనే మీడియా సంస్థ కథనం ప్రచురించింది.
ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అవి పెను దుమారం రేపుతున్నాయి. చిన్నారి పక్కన కూర్చున్న మధ్య వయస్కుడైన వరుడిని చూసి నెటిజన్లు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక తాలిబన్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అయితే, ఈ అధికారుల తీరు మరింత విడ్డూరంగా ఉంది. వారు ఆ వ్యక్తి, బాలికను తన ఇంటికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, బాలికకు తొమ్మిదేళ్ల తర్వాత భర్త ఇంటికి పంపవచ్చని వారు చెప్పినట్లు సమాచారం.