శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (12:13 IST)

థాయ్ మారణహోమ నరహంతకుడు భార్యాపిల్లను కూడా చంపేసి ఆత్మహత్య

థాయిలాండ్‌లోని డే కేర్‌ సెంటర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమానికి తెగబడిన నరహంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాక్లాంగ్‌ జిల్లా నాంగ్‌బు నాంఫూ పట్టణంలోని ఓ డే కేర్‌ సెంటర్‌లో బహిరంగ కాల్పులు జరిపిన పాన్య ఖమ్రాఫ్‌ అనే మాజీ పోలీస్‌ అధికారి ఆ తర్వాత కుటుంబాన్ని కూడా చంపి తర్వాత బలవన్మరణానికి పాల్పడినట్టు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 
 
గురువారం మధ్యాహ్న సమయంలో డే కేర్‌ సెంటర్‌లోకి ప్రవేశించిన నిందితుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 23 మంది చిన్నారులతో పాటు మొత్తం 34 మంది మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 
 
మృతుల్లో రెండేళ్ల వయసు చిన్నారులే ఎక్కువ మంది ఉండటం అందరినీ హృదయాలను తీవ్రంగా కలచిస్తోంది.
 
ఈ ఘటనలో ఎనిమిది మాసాల గర్భిణిగా ఉన్న ఓ టీచర్‌తో పాటు నలుగురైదుగురు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి జిల్లా అధికారి జిడపా బూన్సమ్‌ వెల్లడించారు. 
 
26 మంది మృతదేహాలను గుర్తించామని.. వీరిలో 23 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు, ఒక పోలీస్‌ అధికారి ఉన్నట్టు ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు. 
 
ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. 
 
అయితే, ఈ మారణహోమానికి తెగబడిన అనంతరం ఘటనా స్థలం నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకున్న నిందితుడు తన భార్య పిల్లల్ని కూడా చంపేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.