1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (14:35 IST)

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..? ఈ పరిణామాలు దేనికి సంకేతం..?

ఇరాన్‌లో అమెరికా సైనిక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడిలో ఇప్పటికే ఇరాన్ అగ్రస్థాయి కమాండర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ హత్యకు గురయ్యారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమోనని చర్చ సాగుతోంది. 
 
అమెరికా బాంబు దాడిలో సులేమానీ హతమైన తర్వాత గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సులేమానీ ఆ దేశంలోని రెండో శక్తివంతమైన నేతగా పేరొందారు. ఆయన నేరుగా ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ హయతుల్లా ఖమేనికి మాత్రమే జవాబుదారీగా ఉండేవారు.
 
కాగా, తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశం మేరకే ఈ దాడి జరిపినట్టు స్పష్టంగా చెప్పడంతో ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలాది అమెరికన్లపై దాడులు చేసిన సులేమానీని ఎప్పుడో చంపాల్సిందని ట్రంప్‌ పేర్కొనగా.. తీవ్రమైన ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. దీంతో అమెరికా-ఇరాన్‌ మధ్య ఒక్కసారిగా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. 
 
బరాక్‌ ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని అమెరికా రెండేళ్ళ కిందట అర్ధంతరంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ట్రంప్‌ ప్రభుత్వం ఇరాన్‌ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో విబేధాలు పతాక స్థాయికి చేరాయి. ఇంకా కుడ్స్‌ ఫోర్స్‌ను ఉగ్రవాద సంస్థగా, సులేమానీని ఉగ్రవాదిగా ప్రకటించింది అమెరికా. దీంతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమోనని వార్తలు వస్తున్నాయి.