మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (11:18 IST)

సీఏఏపై పాత వీడియోలు పోస్టుచేసిన ఇమ్రాన్ ఖాన్.. నవ్వుల పాలైన పాక్ ప్రధాని

భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలను పాకిస్థాన్ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంది. ఇందులో భాగంగా పాక్ ప్రధాని సీఏఏపై  పాత వీడియోలను పోస్టు చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ముస్లింలను యూపీలో దారుణంగా హింసిస్తున్నారంటూ ట్వీట్ చేసిన ఇమ్రాన్.. దానికి మూడు వీడియోలను జతచేశారు. 
 
అయితే, ట్వీట్ చేసిన కాసేపటికే ఇమ్రాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తప్పును గ్రహించిన ఇమ్రాన్ ఆ తర్వాత ఆ వీడియోలను తొలగించారు. అయితే, అప్పటికే ఇమ్రాన్‌పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఓ దేశానికి ప్రధాని అయి ఉండీ ఇలాంటి ఫేక్ వీడియోలను ఎలా పోస్టు చేస్తారంటూ నెటిజన్లు నిప్పులు చెరిగారు. భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఆయన ఇరుకున పడ్డారని నెటిజన్లు కామెంట్ చేశారు.
 
నిజానికి ఇమ్రాన్ ఖాన్ పోస్టు చేసిన వీడియోలో భారత్‌లో సీఏఏపై జరుగుతున్న ఆందోళనలకు సంబంధించినవి కావని తేలిపోయింది. మే 2013లో ఢాకాలో ఆందోళనకారులపై బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చేసిన లాఠీచార్జ్ దృశ్యాలు ఇవని  తేల్చారు. ముందువెనక ఆలోచించకుండా వాటిని పోస్టు చేసి అభాసుపాలయ్యారు.