బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (08:57 IST)

రష్యా అధినేత పుతిన్‌కు మరో షాక్ ... ఉక్రెయిన్‌లోని ఆస్తులు సీజ్

ఉక్రెయిన్‌పై ఇప్పటికే భీకర యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిరి పుతిన్‌కు ఇపుడు మరో షాక్ తగిలింది. ఉక్రెయిన్‌లోని రష్యన్ల ఆస్తులను సీజ్ చేశారు. అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగించేలా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టింది. ఈ చర్యను అనేక దశాలు ఖండిస్తున్నాయి. రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు కూడా విధిస్తున్నాయి. స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్టు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. 
 
తాజాగా పుతిన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ షాక్ నుంచి ఇతర దేశాల నుంచి కాకుండా తాను దండయాత్ర చేసిన ఉక్రెయిన్ నుంచి తగిలింది. తమ దేశంలోని రష్యన్ల ఆస్తులను ఉక్రెయిన్ పాలకులు ఫ్రీజ్ చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీంతో ఉక్రెయిన్‌లోని రష్యన్ల ఆస్తుల సీజ్‌కు సంబంధించిన చట్టం అమల్లోకి వచ్చింది. 
 
ఫలించని రెండో దశ చర్చలు 
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతుంది. మరోవైపు, శాంతి కోసం ఇరు దేశాల మధ్య రెండో దశ చర్చలు జరిగాయి. ఈ చర్చలకు బెలారస్ - పోలాండ్ దేశాల సరిహద్దు ప్రాంతం వేదికగా నిలిచింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో అపారమైన ప్రాణనష్టం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల ప్రతినిధులు రెండో దశ శాంతి చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చలు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. 
 
అయితే, ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రస్తుత యుద్ధ పరిస్థితులను ముగించడంతోపాటు డాన్‌బాస్‌లో శాంతిని పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు రష్యా విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని ప్రజలందరూ శాంతియుత జీవనానికి తిరిగి రావడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్లు చెప్పింది.
 
అంతకుముందు ఉక్రెయిన్‌ బృందంలోని సభ్యుడైన స్థానిక ప్రజాప్రతినిధి డేవిడ్ అరాఖమియా మాట్లాడుతూ.. చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌లో మానవతా సహాయ చర్యల కోసం ‘హ్యూమానిటేరియన్‌ కారిడార్‌’ల ఏర్పాటుపై ఒప్పందం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. మరోవైపు చర్చలు జరిగినప్పటికీ తమ దాడులను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌ నిస్సైనీకరణే తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేసింది.