శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (22:14 IST)

హెచ్1బీ వీసాల జారీలో కొత్త నిబంధనలు - భారతీయులకు తీవ్ర నష్టం!

అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశం జారీచేసే కీలకమైన హెచ్1బీ వీసాల జారీలో కీలక మార్పులు చేసింది. అంటే.. సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీసాల నిషేధంపై అనేక కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, నిషేధం ఎత్తివేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో అమెరికా సర్కారు తమ దేశ ప్రజలకు మేలు చేకూర్చేలా హెచ్1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసింది. 
 
ఇకపై అమెరికా కంపెనీలు 85 వేల మందికి మించి విదేశీ నిపుణులను తీసుకోవడం కుదరదు. అంతేకాదు, హెచ్1బీ వీసా విధానంలో అభ్యర్థుల ప్రత్యేక నైపుణ్యాల నిర్వచనాన్ని కూడా మార్చారు. ప్రత్యేక నైపుణ్యాల సంఖ్యను కూడా తగ్గించినట్టు తెలుస్తోంది. 
 
దీనిపై అమెరికా హోంశాఖ కార్యదర్శి చాడ్ వోల్ఫ్ స్పందిస్తూ, ఆర్థిక భద్రతతోనే దేశ భద్రత ముడిపడి ఉంటుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అమెరికా ప్రజలే అత్యధిక లబ్ది పొందేలా చట్టపరిధిలో వీలైనంతగా చేయాలి అని అభిప్రాయపడ్డారు.
 
కాగా, హెచ్1బీ వీసాల విధానంలో అమెరికా కంపెనీలకు పరిమితులు విధించడం భారతీయ ఐటీ నిపుణులకు నిరాశ కలిగించే విషయమే. అమెరికా కంపెనీల్లో అత్యధిక సంఖ్యలో సేవలు అందిస్తున్నది భారత ఐటీ నిపుణులేనన్న సంగతి తెలిసిందే. 
 
ఈ సరికొత్త నిబంధనలు కారణంగా భారతదేశానికి చెందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే, ఇప్పటికే అక్కడ పని చేస్తున్న వారికి కూడా నష్టం చేకూర్చేలా వుందని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.