శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (20:20 IST)

చెన్నై సూపర్ కింగ్స్‌లో కరోనా కలకలం : బౌలరు‌తో సహా 10 మందికి పాజిటివ్ (video)

ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం చెలరేగింది. జట్టులోని ఆటగాళ్ళకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటవ్‌గా నిర్ధారణ అయింది. జట్టులోని ప్లేయర్లలో సుమారు 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం.
 
ప్రస్తుత భారత బౌలర్, పలువురు జట్టు సిబ్బంది సహా గురువారం నాలుగోసారి కరోనా పరీక్షలు చేయించుకోగా శుక్రవారం వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిసింది. కరోనా సోకిన ఆటగాళ్ల పేర్లు తెలియరాలేదు. దీంతో వారికి మరో వారం క్వారంటైన్ పొడిగించారు. దీని వల్ల జట్టు ప్రాక్టీస్‌పై ప్రభావం పడనుంది. 
 
నిజానికి సీఎస్కే జట్టు ఈ నెల 21వ తేదీనే దుబాయ్ చేరుకోగా, క్వారంటైన్ ముగియాల్సిన తరుణంలో కరోనా కారణంగా మరో 7 రోజుల క్వారంటైన్ పొడిగించారు. అంటే సెప్టెంబరు ఒకటో తేదీ వరకు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. 
 
ఆగస్టు 21న సీఎస్‌కే యూఏఈ చేరగా బీసీసీఐ నిర్దేశించిన ప్రోటోకాల్‌ ప్రకారం ప్రాక్టీస్‌కు ముందు మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ‘ఇటీవల భారతదేశం తరపున ఆడిన ఒక కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్‌తో పాటు కొంతమంది సీఎస్‌కే సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని’ ఐపీఎల్‌ సీనియర్ అధికారులు తెలిపినట్లు సమాచారం.