శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (12:06 IST)

భారతీయులందరికీ రిలయన్స్ జియో స్మార్ట్ ఫోన్ ఉచితం.. ధర రూ.0

విశ్లేషకులు ముందుగా ఊహించినట్టుగానే, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత చౌక ధరకు 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేశారు. వాయిస్ కమాండ్‌తో కాల్స్, మెసేజ్‌లు చేసుకునేలా ఈ ఫోన్ ఉంటుందని తెలిపారు.

విశ్లేషకులు ముందుగా ఊహించినట్టుగానే, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత చౌక ధరకు 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేశారు. వాయిస్ కమాండ్‌తో కాల్స్, మెసేజ్‌లు చేసుకునేలా ఈ ఫోన్ ఉంటుందని తెలిపారు. కనెక్టివిటీ, అఫర్డబిలిటీ, డేటా స్పీడ్ ఆధారంగా ఫీచర్ ఫోన్‌ను తయారు చేశామని చెప్పారు.
 
దేశంలో మొత్తం 78 కోట్ల మొబైల్ ఫోన్లు ఉండగా, వాటిల్లో 50 కోట్లకు పైగా ఫోన్లు ఫీచర్ ఫోన్లేనని గుర్తు చేసిన ముఖేష్ అంబానీ, వారందరినీ డిజిటల్ గొడుగు కిందకు తీసుకొచ్చారు. ఇందుకోసం భారతీయులందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుందనీ, ఈ మొత్తాన్ని మూడేళ్ళ తర్వాత పూర్తిగా తిరిగి ఇస్తామని ప్రకటించారు. 
 
ప్రస్తుతం ఫీచర్ ఫోన్ యూజర్లు నిమిషం కాల్‌కు రూ.1.20 నుంచి రూ.1.50 వరకూ, ఒక జీబీ డేటాకు రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకూ, ఎస్ఎంఎస్‌కు రూ.1 నుంచి రూ.1.50 చెల్లిస్తున్నారని గుర్తు చేసిన ఆయన, ఇకపై ఆ పరిస్థితి ఉండదని అన్నారు. వచ్చే 12 నెలల కాలంలో దేశంలోని 99 శాతం మందికి జియో సిగ్నల్స్ దగ్గరవుతాయని తాను గర్వంగా చెబుతున్నట్టు ముఖేష్ వెల్లడించారు. 
 
2జీ కవరేజ్ కన్నా 4జీ కవరేజ్ అధికంగా ఉండేలా చేయడమే తన ముందున్న తొలి కర్తవ్యమని అన్నారు. 2జీ విస్తరణకు 25 సంవత్సరాలు పడితే, తాము మూడేళ్లలోనే 4జీని దేశవ్యాప్తం చేశామన్నారు. సెప్టెంబర్ నాటికి ఇండియాలో జియో ఆఫీసుల సంఖ్య 10 వేలకు చేరుతుందని, అన్ని చిన్న, పెద్ద పట్టణాలకూ విస్తరిస్తామని తెలిపారు. 
 
 
అంతకుముందు ముఖేష్ అంబానీ రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ... 'ఇండియా కా స్మార్ట్ ఫోన్' పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టారు. కాగా, ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ కంట‌త‌డి పెట్టారు. ఈ 40 ఏళ్ల‌లో రిల‌యెన్స్ సాధించిన ప్ర‌గ‌తిని చెబుతుండగా ఆయన కంటతడిపెట్టారు. అలాగే, ప్రేక్ష‌కుల్లో ఉన్న ఆయ‌న త‌ల్లి కూడా విల‌పించారు. 1977లో వస్త్ర‌వ్యాపారం నుంచి ఇప్పుడు ఎన్నో రంగాల్లోకి విస్త‌రించిన‌ట్లు అంబానీ చెప్పారు. 
 
ప్ర‌స్తుతం రిల‌యెన్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.5 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 1977లో రూ.3 కోట్లుగా ఉన్న సంస్థ ట‌ర్నోవ‌ర్ ప‌ది వేల రెట్లు పెరిగి రూ.30 వేల కోట్ల‌కు చేరింద‌ని తెలిపారు. 3500 ఉన్న ఉద్యోగులు రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరార‌ని చెప్పారు. ఇక వెయ్యి ఉన్న షేరు ధ‌ర రూ. 16.5 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని ఆయ‌న తెలిపారు. ప్రతి ఒక్క నిమిషానికి ఏడుగురు కష్టమర్లు జియో కుటుంబంలో చేరుతున్నట్టు తెలిపారు.