ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (12:15 IST)

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం... ప్రచారం బంద్.. ఐఏఎస్ బదిలీ

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నిర్ణీత గడువు కంటే ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిషేధించింది. దీంతో చివరి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రచారం గురువారం రాత్రి 10 గంటలతోనే ముగియనుంది. వాస్తవానికి ఈ దశ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియాల్సివుంది. 
 
రెండు రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టిన రోడ్ షో సందర్భంగా బీజేపీ - టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగిన విషయం తెల్సిందే. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని ఈసీ తీవ్రంగా పరిగణించి ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసింది. 
 
అంతేకాకుండా, ప్రభుత్వ అధికారులపై కొరడా ఝుళిపించింది. ఓవైపు అధికార తృణమూల్, బీజేపీల మధ్య వీధి పోరాటాలు తీవ్రరూపు దాల్చిన నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. సీఐడీ ఏడీజీ రాజీవ్ కుమార్‌ను కేంద్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆయన వెంటనే ఢిల్లీలోని హోంశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎంతో కీలకమైన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భట్టాచార్యపైనా వేటు పడింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుని సీఈవోకు లేఖ రాయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది.