1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (11:27 IST)

ఇది ఏకగ్రీవం కాదు.. అది నియంత నిజమైన ముఖం : సూరత్ ఏకగ్రీవంపై రాహుల్ స్పందన

rahul gandhi
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అదేసమయంలో పార్టీ డమ్మీ అభ్యర్థి సురేశ్ నామినేషన్‌ను కూడా ఆయన తిరస్కరించారు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేబీ అభ్యర్థి ఒక్కరే పోటీలో నిలవడంతో ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇదీ నియంత నిజమైన ముఖం అంటూ విమర్శించారు.
 
ప్రాథమికంగా ప్రతిపాదకుల సంతకంలో వ్యత్యాసాలను గుర్తించడంతో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను జిల్లా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో నియంత నిజ స్వరూపం... మరోసారి దేశం ముందు వెల్లడైందంటూ తన ట్విట్టర్ వేదికగా రాహల్ ట్వీట్ చేశారు. 'దేశం ముందు మరోసారి నియంత అసలు 'ముఖం' బయటపడింది. ప్రజానాయకుడిని ఎన్నుకునే హక్కును హరించివేయడం ద్వారా... బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడంలో మరో అడుగు వేశారు. అందుకే మరోసారి చెబుతున్నాను... ఇది కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎన్నికలు కాదు, దేశాన్ని రక్షించే ఎన్నికలు, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఎన్నికలు' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 
 
అదేసమయంలో సూరత్‌లో తమ అభ్యర్థుల నామినేషన్‌ను తిరస్కరించడంపై కోర్టుకు వెళతామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. సూరత్ గెలుపు మ్యాచ్ ఫిక్సింగ్ అని విమర్శించింది. కాంగ్రెస్ దాదాపు మూడు దశాబ్దాల చరిత్రలో ఒక లోక్‌సభ అభ్యర్థి ఏకగ్రీవం కావడం గమనార్హం.