1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (10:07 IST)

సాధువులను వదలని కరోనా.. 30 మందికి కోవిడ్ పాజిటివ్

కరోనా వైరస్ సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పుణ్యస్నానాలు చేసేందుకు వస్తున్న సాధువులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో 30 మంది సాధువులకు కరోనా సంక్రమించినట్లు తేలింది. ఈ విషయాన్ని హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్‌కే జా తెలిపారు. 
 
అఖాడాలకు వైద్య బృందాలు వెళ్తున్నాయని, అక్కడ ఉండే సాధువులకు ఆర్‌సీ పీసీఆర్ పరీక్షలు నిరంతరం చేస్తున్నారన్నారు. హరిద్వార్‌లో క్రిటికల్‌గా ఉన్న కేసులను రిషికేశ్‌లో ఉన్న ఎయిమ్స్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ప్రజలను మాత్రం హోం ఐసోలేషన్‌లోకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని హాస్పిటల్‌లో చేర్పిస్తున్నారు. హరిద్వార్‌లో ఉన్న హాస్పిటళ్లలో ఎటువంటి ఆందోళనకర పరిస్థితి లేదన్నారు.
 
హరిద్వార్‌లో గురువారం ఒక్క రోజే 600 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. అక్కడ ఉన్న నిరంజనీ మఠం ఈ నేపథ్యంలో ఓ హెచ్చరిక జారీ చేసింది. కుంభమేళాలో పాల్గొంటున్న సాధువులంతా వెళ్లిపోవాలంటూ పేర్కొంది. 
 
నిరంజనీ అఖారా కార్యదర్శి రవీంద్ర పురి మాట్లాడుతూ.. పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల హరిద్వార్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గంగా నదిలో పుణ్యం స్నానం చేసిన సాధువులంతా తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ కోరామని చెప్పారు. హరిద్వార్‌లో సుమారు 13 అఖారాలు ఉన్నాయి. వాటిల్లో లక్షలాది మంది సాధువులు ఉంటున్నారు.