1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (20:58 IST)

బోగస్ ఓట్లకు చెక్ .. ఓటరు కార్డుతో ఆధార్ లింకు - కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ ఓటర్లను ఏరివేసే ప్రక్రియలో భాగంగా ఓటరు కార్డుతో ఆధార్ నంబరును లింకు చేయనుంది. దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. ఇది పక్కా అమలైతే ఇకపై బోగస్ ఓట్లు అనేవి ఉండవు. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓట్లను కలిగివుంటే ఈ ఆధార్ నంబరు అనుసంధానంతో చెక్ పడుతుంది. అలాగే, ఒక వ్యక్తి దొంగ ఓట్లు వేయడానికి వీలుపడదు. 
 
ఓటరు కార్డుతో ఆధార్ నంబరును లింకు చేయాలని భారత ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో కోరుతోంది. ఆ దిశగా సంస్కరణలు కూడా చేపట్టింది. ఇపుడు కేంద్రం దీనికి ఆమోదముద్రవేసింది. ఓటల్ జాబితాను బలోపేతం చేయడానికి, ఓటింగ్ ప్రక్రియను మరింత పెరుగుపరచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ఈ బిల్లుకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదముద్రపడనుంది. ఇప్పటికే పాన్ కార్డుతో ఆధార్ నంబరును లింక్ చేసిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, కొత్త ఓటర్ల నమోదుకు ఇకపై యేడాదికి నాలుగుసార్లు అవకాశం కల్పిస్తారు. దీనికి కోసం ప్రతి యేటా నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలను ఇస్తారు. ప్రతి యేటా జనవరి ఒకటో తేదీ నాటికి 18 యేళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఇప్పటివరకు యేడాదిలో కేవలం ఒక్కసారి మాత్రమే ఓటరు నమోదుకు అవకాశం ఉంది. ఇకపై ఏటా నాలుగుసార్లు యువత ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.