బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (18:09 IST)

ఆ ఎమ్మెల్యేల్లో 40 శాతం మంది తీవ్ర నేర చరితులు

మహారాష్ట్ర శాసన సభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మంది తీవ్ర నేరాల కేసుల్లో నిందితులని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది.

ఈ నెల 21న జరిగిన ఎన్నికల కోసం అభ్యర్థులు తమ నామినేషన్లతోపాటు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఓ నివేదికను రూపొందించి, విడుదల చేసింది.
 
మహారాష్ట్ర శాసన సభకు కొత్తగా 288 మంది శాసన సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో 285 మంది దాఖలు చేసిన అపిడవిట్లను అధ్యయనం చేసినట్లు ఏడీఆర్ పేర్కొంది. 176 మంది ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారని తెలిపింది.

గత శాసన సభలోని నేర చరితులైన ఎమ్మెల్యేలతో పోల్చితే, ఈసారి 5 శాతం ఎక్కువ మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది. 12 మంది కొత్త ఎమ్మెల్యేల అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడంతో పరిశీలించలేకపోయినట్లు తెలిపింది.
 
ఇద్దరు ఎమ్మెల్యేలు హత్య కేసుల్లో, 11 మంది ఎమ్మెల్యేలు హత్యాయత్నం కేసుల్లో, నలుగురు ఎమ్మెల్యేలు కిడ్నాప్ కేసుల్లో నిందితులని పేర్కొంది. వీరిలో శివసేన, ఎన్‌సీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు తెలిపింది.
 
బీజేపీ ఎమ్మెల్యేల్లో 40 మందిపైనా, శివసేన ఎమ్మెల్యేల్లో 26 మందిపైనా, ఎన్‌సీపీ ఎమ్మెల్యేల్లో 17 మందిపైనా, 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనా, స్వతంత్రుల్లో ఆరుగురిపైనా తీవ్ర నేరాలు విచారణలో ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.