మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (12:27 IST)

శివసేన డిమాండ్ న్యాయమైనది : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 21వ తేదీన వెల్లడయ్యాయి. ఈ ఫలితాల తర్వాత బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సంపాదించుకుంది. అయితే, శివసేనతో సంబంధం లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శివసేన ముఖ్యమంత్రి స్థానాన్ని డిమాండ్ చేస్తోంది. పైగా, అధికారాన్ని పంచుకోవాలని కోరుతోంది. ఇది కమలనాథులకు ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో శివసేన డిమాండ్‌పై ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ స్పందించారు. అండగా నిలిచారు. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరిసగం రోజులు పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌లో న్యాయం ఉందన్నారు. శివసేన చేస్తున్న డిమాండ్‌ కొత్తదేమీ కాదని, 1990లో కూడా ఈ ఫార్ములాను అనుసరించిన కారణంగా తాజాగా వారీ డిమాండ్‌ చేస్తున్నట్టు గుర్తుచేశారు. 
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయగా బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి సిద్ధమైనా ముఖ్యమంత్రి పీఠాన్ని తమకు కూడా ఇవ్వాలని శివసేన డిమాండ్‌ చేస్తుండడంతో అనిశ్చిత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్‌పవర్‌ స్పందన చర్చనీయాంశంగా మారింది.
 
వాస్తవంగా కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న ఊహాగానాలు చెలరేగినా అదేం లేదని ఎన్సీపీ కొట్టిపారేసింది. మరి సీనియర్‌నేత పవార్‌ తాజా ప్రకటన ఎందుకు చేశారన్నది తెలియాల్సి ఉంది.