1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (20:06 IST)

చెన్నై మరో బీరూట్ సిటీ కానుందా?? : 700 టన్నుల నైట్రేట్ నిల్వలు!

ఇటీవల లెబెనాన్ రాజధాని బీరూట్ నగరంలోని పోర్ట్ సిటీలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో 135 మంది చనిపోగా, 4 వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ముఖ్యంగా, అమ్మోనియం నైట్రేట్ పేలడం వల్ల వచ్చిన విషవాయువుల కారణంగా బీరూట్ నగరమంతా శ్మశానాన్ని తలపిస్తోంది. విషవాయుల కారణంగా స్థానికులంతా తమ ఇళ్ళను ఖాళీచేసి వెళ్లిపోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 
 
ఈనేపథ్యంలో ఇప్పుడు అమ్మోనియం నైట్రేట్ నిల్వలు కలిగిన ప్రపంచదేశాలన్నీ ఉలిక్కిపడుతున్నాయి. భారత్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ఓ కంటైనర్ కేంద్రంలో 697 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉండటమే అందుకు కారణం. బీరుట్‌లో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో చెన్నైలో ఉన్న అమ్మోనియం నైట్రేట్‌ను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇంత పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచడం ప్రమాదకరమని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. 
 
లెబనాన్ రాజధాని బీరుట్‌లో అమ్మోనియం నైట్రేట్ సృష్టించిన విధ్వంసంతో చెన్నై అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. అటు, పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ కేంద్ర విభాగం దేశవ్యాప్తంగా గోదాములు, పోర్టుల్లో ఉన్న రసాయన నిల్వలు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని, 48 గంటల్లో వాటి పరిస్థితి సమీక్షించాలని అధికారులను ఆదేశించింది. ఇక, చెన్నైలో ఉన్న 697 టన్నుల్లో 7 టన్నులు అప్పటి వరదల్లో దెబ్బతినగా, మిగిలిన 690 టన్నులను ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.
 
కాగా, గత 2015 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ దిగుమతిదారుడు భారీ మొత్తంలో అమ్మోనియం నైట్రేట్‌ను దిగుమతి చేసుకున్నాడు. ఈ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాను వ్యవసాయంలో వాడే ఎరువుల తయారీలో వినియోగించుకునేందుకు దిగుమతి చేసుకున్నట్టు మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు. అధికారుల తనిఖీల్లో అది పేలుడు పదార్థం స్థాయిలో ఉందని, వ్యవసాయిక ఎరువు కంటే దాని తీవ్రత అధికంగా ఉందని తేలింది. దీంతో దిగుమతి చేసుకున్న అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న మొత్తం అమ్మోనియం నైట్రేట్ విలువ రూ.1.80 కోట్ల అని అధికారులు చెబుతున్నారు.