1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (05:35 IST)

హిజ్రాల కోసం అక్షయ్ కుమార్ కోటిన్నర విరాళం

ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈసారి హిజ్రాల కోసం ముందుకొచ్చాడు. దర్శకుడు రాఘవ లారెన్స్‌, అక్షయ్ కలిసి చెన్నైలో తొలిసారి హిజ్రాల కోసం ఇళ్లు నిర్మించబోతున్నారు.

ఇందుకోసం అక్షయ్ కుమార్ కోటిన్నర రూపాయలు విరాళం ప్రకటించాడు. ఈ మేరకు నేడు (ఆదివారం) లారెన్స్‌తో కలిసి ట్రాన్స్‌జెండర్ల (హిజ్రాలు)కు చెక్కు బహూకరించాడు. బాలీవుడ్ ఫొటో గ్రాఫర్ వైరల్ భయాని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేయడంతో వైరల్ అయింది.

మరోవైపు లారెన్స్ కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. హిజ్రాల గృహ నిర్మాణం కోసం ఓ హీరో ఇంత పెద్దమొత్తంలో విరాళం ప్రకటించడం దేశంలోనే ఇది తొలిసారని ప్రశంసించాడు.
 
‘‘నేను మీతో ఒక శుభవార్తను పంచుకోవాలనుకుంటున్నాను. అక్షయ్ కుమార్ సార్ దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల ఇళ్ల నిర్మాణం కోసం కోటిన్నర రూపాయలు విరాళంగా అందించారు.

మా ట్రస్ట్ ద్వారా భూమిని సేకరిస్తాం. ఇళ్ల నిర్మాణం కోసం మరిన్ని నిధులు సేకరిస్తాం. ‘లక్ష్మీబాంబ్’ షూటింగ్ సందర్భంగా మా ట్రస్ట్ ప్రాజెక్టుల గురించి, హిజ్రాలకు ఇళ్ల నిర్మాణం గురించి అక్షయ్ సార్‌తో మాట్లాడా.

ఆ విషయం విన్న వెంటనే మరేమీ మాట్లాడకుండా ఇళ్ల నిర్మాణానికి రూ.కోటిన్నర విరాళం ఇస్తానని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఆయన ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు’’ అని లారెన్స్ పేర్కొన్నాడు.