గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:37 IST)

కరోనాపై పోరులో ప్రజలంతా సైనికులే.. మన్‌కీ బాత్‌లో ప్రధాని

కరోనాపై పోరులో ప్రజలంతా సైనికులేనని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ..కరోనాపై దేశ ప్రజలంతా యుద్ధం చేస్తున్నారని, చేయిచేయి కలిపి పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు.

కరోనాపై పోరుకు ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని, మనం చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. భారత ప్రజల స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారని.. విపత్తు సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

ప్రజలు ఆకలితో అలమటించకుండా రైతులు సాయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు బాసటగా నిలిచారన్నారు. స్వచ్ఛ భారత్‌, శౌచాలయాల నిర్మాణాల్లోనూ ప్రజలు సహకరించారని.. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.

కష్ట సమయంలో ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కొంత మొత్తాన్ని త్యాగం చేశారని ప్రధాని మోదీ తెలిపారు.