గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2024 (10:52 IST)

42 వైద్యులపై బదిలీవేటు... వెనక్కి తగ్గిన వెస్ట్ బెంగాల్ సర్కారు!!

mamata benargi
కోల్‌కతాలో జూనియర్ మహిళ వైద్యార్థిని హత్యాచార ఘటనతో సంబంధం ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దేశ వ్యాప్తంగా వైద్యులు, పారామెడికల్ స్టాఫ్ ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నిరసనల్లో పాల్గొన్నందుకుగాను 42 మంది వైద్యులపై బెంగాల్ సర్కారు బదిలీ వేటు వేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు రావడంతో బెంగాల్ వైద్య ఆరోగ్య శాఖ వెనక్కి తగ్గింది. 
 
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇవాళ 42 మంది డాక్టర్లను బదిలీ చేయడం విమర్శలకు దారితీసింది. జూనియర్ డాక్టర్ పై హత్యాచారం ఘటనకు వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొన్నందునే ఆ డాక్టర్లను బదిలీ చేశారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది.
 
ఈ నేపథ్యంలో, బెంగాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో, ఆ డాక్టర్ల బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. బెంగాల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్ స్పందిస్తూ... ఈ బదిలీలకు, హత్యాచార నిరసనలకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ నోటిఫికేషన్‌లో పేర్కొన్న బదిలీలకు సంబంధించిన ప్రక్రియ రెండు నెలల కిందటే ప్రారంభమైందని వెల్లడించారు.
 
వైద్యుల పేర్లలో అక్షర దోషాల కారణంగా బదిలీ ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. ఇప్పుడా బదిలీ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నామని నారాయణ్ స్వరూప్ నిగమ్ చెప్పారు.