శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

బెంగాల్ విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం.. జైకొట్టిన బీజేపీ!!

west bengal
వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని ముక్కలు (విభజన) చేయాలని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పాలకులు ఆలోచన చేస్తున్నారు. గతంలో ఇదే అంశంపై పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టి... తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు వీలుగా బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలన్నది ఆ పార్టీ నేతల మనోగతంగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ విభజన డిమాండ్లను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. రాష్ట్రాన్ని విభజించాలంటూ... ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌తో కూడిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
 
ఈ డిమాండ్‌లు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో అధికార టీఎంసీ సోమవారం రూల్ 185 కింద అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ... కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని తాము నమ్ముతామని, అయితే రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నాలను మాత్రం ఖండిస్తున్నామన్నారు.
 
ఈ తీర్మానానికి ప్రతిపక్ష బీజేపీ కూడా మద్దతు పలికింది. అయితే ఉత్తర ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నట్లు పేర్కొంది. తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ, ఐక్య పశ్చిమ బెంగాల్ సమగ్ర అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని, రాష్ట్రాన్ని విభజించే ఏ ప్రయత్నానికైనా తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ సమగ్ర అభివృద్ధి గురించి తీర్మానంలో ప్రస్తావించాలని కోరారు.
 
ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదనను తీర్మానంలో చేర్చేందుకు మమతా బెనర్జీ అంగీకరించారు. చర్చల అనంతరం ఎలాంటి విభజన డిమాండ్ చేయకుండా బెంగాల్‌ను ఆదుకుంటామని, బెంగాల్ అభివృద్ధికి కృషి చేస్తామనే ప్రత్యామ్నాయ తీర్మానాలను సభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.