శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (14:27 IST)

వారసుడు కావాలనుకున్నాడు.. ఆడపిల్ల పుట్టిందని బావిలో తోసేశాడు..

వారసుడు కావాలనుకున్నాడు. కానీ అతని భార్య మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భార్యా పిల్లలపై కోపం పెంచుకున్నాడు. సమయం చూసుకుని వారిని బావిలో తోసేశాడు. అయితే భార్య, చిన్నారి బతికి బయటపడగా, పెద్దకూతురు మరణించింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతార్పూర్‌లో జరిగింది.
 
ఛతార్పూర్‌కు చెందిన రాజా బైయా యాదవ్‌ భార్య మూడు నెలల క్రితం ఓ ఆడపిల్లకి జన్మనిచ్చింది. వారికి అప్పటికే ఎనిమిదేళ్ల అమ్మాయి ఉంది. అయితే అతడు రెండో సంతానంగా కొడుకు పుడతాడని అనుకున్నాడు. అమ్మాయి కావడంతో నిరాశకు గురయ్యాడు.
 
కాగా, డెలివరీ అయినప్పటి నుంచి అతని భార్య తన పుట్టింట్లో ఉంటుంది. చిన్నారికి మూడు నెలలు నిండటంతో వారిని తన ఇంటికి తీసుకుపోవాలనుకున్నాడు. ఈ క్రమంలో శనివారం పన్నా జిల్లాలో ఉన్న తన అత్తగారింటికి వెళ్లాడు. ఆదివారం భార్యా పిల్లలను తీసుకుని ఛతార్పూర్‌ బయల్దేరాడు.
 
అయితే మార్గమధ్యంలో ఓ బావి వద్ద తన బైక్‌ను ఆపి భార్యా పిల్లలను అందులోకి తోసేశాడని పోలీసులు తెలిపారు. దీంతో ఎనిమిదేండ్ల అమ్మాయి చనిపోయిందని వెల్లడించారు. బావిలోనుంచి పైకి రావడానికి ప్రయత్నించిన భార్యపై రాళ్లు కూడా వేశాడని చెప్పారు. 
 
అయితే స్థానికులు ఆమె కేకలు విని ఆమెను రక్షించారని, రాజా యాదవ్‌ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. కొడుకు పుట్టలేదన్న కోపంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.