1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (11:54 IST)

పేద విద్యార్థులకు సీట్లు ఇస్తారా? లేక జైలుకు పంపమంటారా?

గత యూపీఏ ప్రభుత్వం నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సివుంది. అయితే, విద్యా హక్కు చట్టం మాత్రం ఇతర రాష్ట్రాల్లో పక్కాగా అమలవుతుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది అమలు కావడం లేదు. దీనికితోడు అధికారుల నిర్లక్ష్యంతో పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలు ఈ 25 శాతం సీట్లను కేటాయించడం లేదు. 
 
ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25 శాతం సీట్లను ఉచితంగా ప్రైవేటు విద్యా సంస్థలు కేటాయించాలంటూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేశ్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరుగగా, కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 
 
తమ ఆదేశాలను అలు చేయకుండా ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలకు పరోక్షంగా ప్రభుత్వ అధికారులు సాయం చేస్తున్నారంటూ మండిపడింది. ఆర్థికంగా వెనుకబడినవారి పిల్లలకు ప్రైవేటు స్కూల్స్‌లో 25 శాతం సీట్లు ఇచ్చినట్టు చూపించకుంటే జైలుకు పంపాల్సివస్తుంది ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లను హెచ్చరించింది. పైగా, 25 శాతం సీట్ల కేటాయింపునకు సంబంధించిన పూర్తి లెక్కలతో కూడిన వివరాలను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. 
 
ఈ సందర్భంగా కోర్టు కాస్త కఠువుగా వ్యాఖ్యానించింది. "విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి.. లేదంటే మీరు జైల్లో అయినా ఉండాలి" అంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది. పనిలోపనిగా ఇప్పటివరకు ఎంతమంది పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారో వివరాలు కోర్టు ముందు ఉంచాలని అదేశించింది. ఆ వివరాలతో తాము సంతృప్తి చెందకుంటే మాత్రం వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని తేల్చి చెప్పింది.