భారత్కు పొంచివున్న యుద్ధ ముప్పు - ఆ రెండు దేశాల కుట్ర : ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
భారత్కు యుద్ధ ముప్పు పొంచివుందని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ దేశాలతో ఈ యుద్ధ ముప్పు పొంచివుందని ఆయన హెచ్చరించారు. పాక్ పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపడం మనకు ఆందోళనకరమేనని వ్యాఖ్యానించారు. చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్ వినియోగిస్తుందని వెల్లడించారు. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సైనిక సన్నద్ధత, సరిహద్దుల పరిస్థితులు, బంగ్లాదేశ్ అంశం తదితర అంశాలపై అడిగి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
భారత్కు వ్యతిరేకంగా చైనా, పాకిస్థాన్లు కుమ్మక్కువుతున్నాయని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువు అయిన పాకిస్థాన్ మన పొరుగున ఉన్న ఏ దేశంతోనైనా సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఆందోళనకరమని అన్నారు. ఎందుకంటే ఆ దేశాన్ని కూడా పాక్ ఉగ్రవాద చర్యలకు ఉపయోగించుుకనే అవకాశం ఉండటమేనని పేర్కొన్నారు.
చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్ వినియోగిస్తోందని, కుమ్మక్కును సంబంధించి నేడున్న పరిస్థితి ఇది ఆయన అన్నారు. ఆ రెండు దేశాల మధ్య కుట్రపూరిత సంబంధాలు ఉన్నాయన్న వాస్తవాన్ని భారత్ అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్కు సంబంధించి ఇపుడే ఒక నిర్ణయానికి తొందరపాటు అవుతుందని అన్నారు. అయితే, భారత్ - బంగ్లాదేశ్ల మధ్య సైనిక బంధం బలంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.