1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (08:50 IST)

నేటి నుంచి రాహుల్ 'భారత్ జోడో యాత్ర' - రాజీవ్‌కు నివాళి తర్వాత..

rahul gandhi
కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భారత్ జూడో యాత్ర బుధవారం నుంచి లాంఛనంగా ప్రారంభంకానుంది. తమిళనాడులోని కన్నియాకుమారి నుంచి జమ్మూకాశ్మీరులోని శ్రీనగర్ వరకు ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వం వహించనున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకునేలా, దేశంలో బీజేపీయేతర శక్తులను ఏకం చేసేలా, వారి శక్తి బలంగా ఉందని చాటి చెప్పాలన్న ఏకైక లక్ష్యంతో ఈ యాత్రను చేపడుతున్నారు. యాత్ర కోసం రాహుల్‌గాంధీ మంగళవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. 
 
బుధవారం ఉదయం శ్రీపెరుంబుదూరులో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకాన్ని సందర్శిస్తారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్‌ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. తండ్రికి అంజలి ఘటించి అక్కడి నుంచి తిరువనంతపురం మీదుగా కన్యాకుమారి చేరుకుంటారు. స్వామి వివేకానంద, తిరువళ్లువర్‌ విగ్రహాలు, మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ స్మారకాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ మండపం వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ జాతీయ జెండాను రాహుల్‌కి అందించి యాత్రను ప్రారంభించేలా ఏర్పాట్లుచేశారు. 
 
ఇందులో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘెల్‌ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తారు. భారత్‌ జోడో యాత్రను బుధవారం లాంఛనంగా ప్రారంభిస్తారని, రాహుల్‌ నడక మాత్రం గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
 
రాహుల్‌ గాంధీ పాదయాత్రకు నిత్యం 3 షిఫ్టుల్లో పోలీసు బలగాలు భద్రత కల్పించనున్నాయి. తమిళనాడులో 2,500 మంది పోలీసుల్ని ఈ విధుల్లో నియమించారు. యాత్ర తొలి 4 రోజులు తమిళనాడులో కొనసాగనుంది. 11వ తేదీన కేరళలోకి ప్రవేశిస్తుంది.
 
పాదయాత్ర కొనసాగే ప్రాంతాల్లో హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి స్టార్‌ హోటళ్లు, ఏసీ బస్సుల్లో బస చేసేందుకు రాహుల్‌ నిరాకరించారని సమాచారం. ఆయన విశ్రాంతి తీసుకునేందుకు ప్రాథమిక వసతులతో కంటైనర్లను ఏర్పాటు చేసినట్లు నేతలు వివరించారు.
 
యాత్రలో రాహుల్‌గాంధీ వెంట వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 117 మంది కాంగ్రెస్‌ నేతలు నడక సాగించనున్నారు. వీరిని భారత్‌ యాత్రీస్‌ అని పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుంకర పద్మశ్రీ పాల్గొంటుండగా.. తెలంగాణ నుంచి ఆరుగురు వచ్చారు. కేతూరి వెంకటేష్‌, సంతోష్‌.కె, వెంకటరెడ్డి, కత్తి కార్తీకగౌడ్‌, బెల్లయ్యనాయక్‌ తెలావ్‌, అనులేఖ బూస వీరిలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 32 మంది మహిళలకు అవకాశం కల్పించారు.
 
మధ్యాహ్నం తర్వాత యాత్రలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. రాహుల్‌ వెళ్లని రాష్ట్రాల్లో ఈ యాత్రకు అనుబంధంగా 'అతిథి యాత్రీస్‌' పేరుతో కార్యక్రమాలు చేపట్టనున్నారు.