1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జులై 2023 (17:19 IST)

దోశ పార్శిల్‌లో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్ యజమానికి షాక్

dosa
మసాలా దోస పార్శిల్‌లో సాంబార్‌ ఇవ్వలేదని రెస్టారంట్‌ యజమానిపై ఓ కస్టమర్ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణ జరిపిన కమిషన్ ఆ రెస్టారెంట్ యజమానికి రూ.3,500 అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్‌కు చెందిన మనీష్‌ పాఠక్‌ అనే న్యాయవాది టిఫిన్‌ కోసం తన తల్లితో కలసి హోటల్‌కు వెళ్లారు. రూ.140 వెచ్చించి స్పెషల్‌ మసాలా దోసెను పార్శిల్‌ తీసుకున్నారు. కానీ, ఇంటికి వెళ్లి చూసే అందులో సాంబార్‌ లేదు కేవలం దోసె, చట్నీ మాత్రమే ఉంది. మనీష్‌ ఆ విషయం చెప్పేందుకు మరుసటి రోజు అదే రెస్టారెంట్‌కు వెళ్లారు. సాంబార్‌ ఇవ్వటం మరచిపోయారని ఆ వ్యక్తి చెబితే.. 'ఏంటి, రూ.140తో హోటల్‌ మొత్తంగా కొంటావా' అంటూ మేనేజర్‌ హేళనంగా మాట్లాడాడు. 
 
ఈ వ్యాఖ్యలను అవమానంగా భావించిన సదరు కస్టమర్ ఒక న్యాయవాది ద్వారా రెస్టారెట్టి యాజమాన్యానికి నోటీసులు పంపారు. నోటీసులకు యాజమాన్యం స్పందించలేదు. దీంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. 11 నెలల విచారణ అనంతరం రెస్టారంట్‌దే తప్పని కోర్టు నిర్ధారిస్తూ, ఏకంగా రూ.3,500 జరిమానా విధించింది. 
 
కస్టమర్‌ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసినందుకు రూ.2వేలు, లిటిగేషన్‌ ఛార్జీలు కింద వెయ్యి రూపాయలు ఫైన్‌ వేసింది. ఈ డబ్బును 45 రోజుల్లోగా చెల్లించాలని లేకపోతే 8 శాతం వడ్డీని కలిపి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.