1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: శుక్రవారం, 29 మార్చి 2019 (17:47 IST)

మొదటి రాత్రి... వాంతి చేసుకుందని నవ వధువుకి కన్యత్వ పరీక్ష.. ఆ తర్వాత?

పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటుంటారు, కానీ ఓ యువతికి పెళ్లి ఒక్కరోజు ముచ్చట అయింది. ఓ మాసిపోని మచ్చలా మిగిలిపోయింది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజే అవమానాలు చవిచూసింది. కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లి చేసుకున్న వ్యక్తి నరకం చూపించాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.
 
ఉత్తర కర్ణాటకకు చెందిన శరత్(29), రక్ష(26) బెంగళూరులో బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా వీరు కలుసుకుని, కొన్ని రోజులు ఇద్దరూ మాట్లాడుకున్నారు. 2018 నవంబర్‌లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే వీరి పెళ్లికి 15 రోజుల ముందు రక్ష తల్లి చనిపోయింది. పెళ్లికి ముందే అమ్మ చనిపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. డిప్రెషన్‌లో ఉన్న సమయంలో ఆమెకు ఓ స్నేహితుడి ఫోన్ చేసి తల్లి చనిపోయి బాధలో ఉన్న ఆ యువతిని ఓదార్చాడు. రక్ష కూడా పలుసార్లు అతడితో మాట్లాడింది. రక్షను శరత్ తప్పుగా అపార్థం చేసుకోవడానికి ఇది ఓ ప్రధాన కారణంగా మారింది.
 
అయితే శరత్ మాత్రం తనతో పెళ్లి జరగడం రక్షకు ఇష్టం లేదని భావించాడు. కొన్నాళ్లకు రక్ష, శరత్‌ల వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన కొద్దిసేపటికే కడుపులో వికారం కారణంగా రక్ష వాంతి చేసుకుంది. దీంతో అనుమానించిన శరత్ ఆమెను హాస్సిటల్‌కు తీసుకెళ్లి కన్యత్వ పరీక్షతో పాటు ప్రెగ్నెన్సీ పరీక్ష కూడా చేయించాడు. కొద్దిసేపటి తర్వాత ఇదంతా అర్థమయిన రక్ష, శరత్‌పై చేయి చేసుకుంది.
 
ఆ తర్వాత ఆమె భర్తను వదిలి సోదరి ఇంట్లో మూడు నెలల పాటు ఉన్నది. మూడు నెలల తర్వాత ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం శరత్ దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం బాధితురాలిని, భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తన భర్త చేసిన పనిని వారికి చెప్పగా కౌన్సెలింగ్ నిర్వాహకులు షాక్ అయ్యారు. తనకు విడాకులే కావాలని భర్త మొండిగా పట్టుబట్టాడు. దీంతో చేసేదేమీ లేక తనను వేధిస్తున్నాడని భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.