గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (15:38 IST)

హనీమూన్‌కెళ్లిన పెళ్లికొడుకు అనుమానాస్పద మృతి

కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ ట్రిప్ వేసుకున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సరదాగా గడపాలనుకున్నారు. రెండు రోజులుగా హోటల్‌లో బస చేస్తున్నారు. ఇంతలో యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అమన్ చౌదరీ అనే 28 ఏళ్ల యువకుడు తన భార్యతో కలిసి హనీమూన్ కోసం కేరళలోని మున్నార్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ మున్నార్ అందాలను చూస్తూ రెండు రోజులు బాగా ఎంజాయ్ చేసారు. 
 
ఇదిలావుంటే, బుధవారం హోటల్ గది బాల్కనీ నుండి అమన్ చౌదరీ జారిపడిపోయాడు. గ్రాండ్ ప్లాజా రిసార్ట్స్‌లో మూడో అంతస్థులో భార్యా భర్త ఉంటున్నట్లు తెలిసింది. పైనుండి జారిపడగానే అతడిని మున్నార్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుండి ఎర్నాకుళంలోని ఆస్టర్ మెడ్‌సిటీకి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ తుది శ్వాస విడిచాడు. 
 
అతను పొరపాటున బిల్డింగ్ నుండి జారిపడ్డాడా లేక భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమన్ భార్య మాత్రం తను బాల్కనీలో నిల్చుని మాట్లాడుతున్న సమయంలో పొరపాటున జారిపడ్డాడని పేర్కొంది. హనీమూన్ కోసం వచ్చి భర్త శవంతో ఇంటికి వెళ్లాల్సివస్తోందని ఆ అభాగ్యురాలు ఆవేదన చెందుతోంది.