1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (16:38 IST)

పూనమ్ పెట్టిన షరతు విని పెళ్లికొడుకు ఆశ్చర్యపోయాడు..

భారతదేశంలో ఎన్ని చట్టాలు మారినా, ఎంత చదువుకున్నా కట్నం ఇచ్చి అల్లుడిని కొనుక్కునే పరిస్థితి మాత్రం మారలేదు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. హర్యానా రాష్ట్రంలోని బిలావల్ అనే గ్రామానికి చెందిన పూనమ్ అనే అమ్మాయికి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయించారు. 
 
అమ్మాయి తండ్రి ఓ గవర్నమెంట్ టీచర్. సందీప్ అనే యువకుడితో సంబంధం మాట్లాడుకున్నారు. కాగా స్థానికంగా ఉన్న సంప్రదాయాల ప్రకారం అబ్బాయిలే అమ్మాయికి భరణం కింద కట్నకానుకలు ఇవ్వాలి. ఆ విషయాలు పెద్దవాళ్లు మాట్లాడుకునే సమయంలో పూనమ్ మధ్యలో కల్పించుకుని తన మనస్సులో ఉన్న ఆలోచనను బయటపెట్టింది.
 
మీరు నాకు కట్నం ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు కానీ ఓ పని చేసిపెట్టండి. అది ఏమిటని పెళ్లికొడుకు ఆసక్తిగా అడిగాడు. ఆమె దానికి సమాధానమిస్తూ ఓ 11 మంది బాలికల చదువు బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు ఇవ్వాలనుకుంటున్న నగదుని డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీ డబ్బులతో ఆ పిల్లలను చదివించండి.
 
అంతకు మించి నేనేమీ కోరుకోను అని చెప్పే సరికి అత్తారింటివారు కొత్త కోడలు బంగారం అని మెచ్చుకున్నారు. పూనమ్ కూడా తండ్రి బాటలోనే టీచర్‌గా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. పూనమ్ తీసుకున్న నిర్ణయానికి ఊరి ప్రజలంతా సంతోషం వ్యక్తం చేసారు.