శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (10:18 IST)

ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడి మర్మాంగం కోసి దారుణ హత్య

వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కులాలు వేరు, మతాలు వేరు.. అయినా ఒక్కటవ్వాలనుకున్నారు. పెద్దలను ఒప్పిద్దామనుకున్నారు. ప్రేమించినవాడితో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆ యువతి  కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. తన కుటుంబ సభ్యులే తన ప్రియుడిని అతి కిరాతకంగా చంపుతుంటే చూస్తూ ఉండిపోయింది. 

తమ కుమార్తెను  వేరే కులం వాడు ప్రేమించాడని, ఆమె ప్రేమించిన వ్యక్తి మర్మాంగాన్ని కోసి అతి కిరాతకంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు. బీహార్‌లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో పోలీసులు త్వరగానే పురోగతి సాధించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
వివరాలలోకి వెళితే.. ముజఫర్‌పూర్ జిల్లా రేపురా రామ్‌పుర్షా గ్రామానికి చెందిన  సౌరభ్‌రాజ్(19).. సోర్బారా గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది.

సౌరభ్ వేరే కులానికి చెందినవాడు కావడంతో వారి ప్రేమను యువతి  తల్లిదండ్రులు నిరాకరించారు. శుక్రవారం రాత్రి సౌరభ్‌ను పెళ్లి విషయం మాట్లాడమని ఇంటికి పిలిచి.. అతడిపై దాడికి తెగబడ్డారు. అతడి మర్మాంగం కోసి చిత్రహింసలకు గురి చేశారు.
 
అనంతరం అతడిని ఒక హాస్పిటల్‌లో చేర్చి పరారయ్యారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. యువతి ఇంటిపై దాడికి దిగారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి నిందితుల ఇంటి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, కీలక నిందితుడిగా భావిస్తున్న సుశాంత్‌ పాండే అనే యువకుడిని అరెస్టుచేశారు. మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.