1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 19 జనవరి 2022 (18:10 IST)

10 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు కరోనా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణకు దగ్గు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. థర్డ్ వేవ్‌తో జనం వణికిపోతున్నారు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో జనంలో భయం మొదలైంది. క్వారంటైన్ కేంద్రాలన్నీ మళ్ళీ తెరుచుకుంటున్నాయి. మొదటిదశలో ఏవిధంగా అయితే చాపకింద నీరులా కోవిడ్ కేసులు పెరిగాయో మూడవ దశలోను అదే పరిస్థితి నెలకొంది.

 
ముఖ్యంగా ఢిల్లీలో 10 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. జడ్జీలకు కరోనా కారణంగా మూడు కోర్టుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దగ్గుతో బాధపడుతున్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు ఒక కేసు విచారణ సంధర్భంగా దగ్గుతో బాధపడుతున్న విషయాన్ని వెల్లడించారు ఎన్.వి.రమణ.

 
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్. పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను కోరారు ప్రశాంత్ భూషణ్.

 
తాను కూడా దగ్గుతో బాధపడుతున్నానని.. తక్షణం చేపట్టలేమని వచ్చేవారం విచారిస్తామని జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. జడ్జిలందరికీ ఈ కోవిడ్ సోకడం ప్రస్తుతం తీవ్ర చర్చకు కారణమవుతోంది. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేస్తున్నా ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కోవిడ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది.