శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మార్చి 2020 (18:17 IST)

రాష్ట్రాలే కాదు.. జిల్లాల సరిహద్దుల మూసివేతకు కేంద్రం ఆదేశం

కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ... ఈ వైరస్ గొలుసు కట్టును మాత్రం ఛేదించలేకపోతున్నారు. దీంతో కేంద్రం మరోమారు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు దేశాలు, రాష్ట్రాల సరిహద్దులు మాత్రమే మూసివేసివున్నాయి. ఇకపై జిల్లాల సరిహద్దులు కూడా మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్రం హోం శాఖ ఉన్నతాధికారులు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్ణయించారు. 
 
రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు మూసేయాలని స్పష్టం చేసింది. కేవలం నిత్యావసర సరుకుల రవాణాకు మాత్రమే అనుమతించాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈ విషయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి బాధ్యత తీసుకోవాలని తన ఆదేశాల్లో పేర్కొంది. 
 
నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు లేకుండా చూడాలని, ఇప్పటికే సరిహద్దు దాటిన వాళ్లను 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని సూచించింది. విద్యార్థులు, కార్మికులను ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
 
కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, దేశవ్యాప్తంగా 987 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 25 మరణాలు సంభవించాయి.