శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మార్చి 2020 (17:58 IST)

భారత్‌లో పెరిగిన కరోనా రోగులు.. కేరళలో 900 మంది అనుమానితులు?

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. మన దేశంలో మొన్నటివరకు పెద్దగా ప్రభావం చూపని ఈ వైరస్.. ఇపుడు విజృంభిస్తోంది. ఈ వైరస్ బారినపడిన 74 యేళ్ళ కర్నాటక వాసి ఒకరు శుక్రవారం మరణించారు. ఇది దేశంలో కరోనా వైరస్ మరణంగా నమోదైంది. అదేసమయంలో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే 80కి దాటిన ఈ కేసులు.. రెండు మూడు రోజుల్లో సెంచరీ దాటే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే.. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 900 మంది కరోనా అనుమానితులు ఉన్నట్టు సమాచారం. అలాగే, కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో కూడా ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో కర్నాటక, కేరళ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 
 
నిజానికి చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైన ఈ వైరస్ ఇప్పుడు 134 దేశాలకు వ్యాపించింది. చైనా ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా ప్రస్తుతం అక్కడ సింగిల్ డిజిట్ కేసులే నమోదవుతున్నాయి. ఆ తర్వాత ఈ వైరస్ ఖండాలకు విస్తరించింది. ఫలితంగా ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో శుక్రవారం మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో భారత్‌లో కోవిద్ బాధితుల సంఖ్య 80కి చేరుకుంది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు చనిపోగా, ముగ్గురు కోలుకున్నారు. మానేసర్‌లోని క్యారంటైన్ కేంద్రంలో ఉన్న ఇటలీ నుంచి వచ్చిన భారతీయుడికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. మార్చి తొలివారంలో భారత్‌లో ఒకే రోజు రెండు కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయినా పరిస్థితి మాత్రం అదుపులోనే ఉంది.
 
కాగా.. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, హర్యానా, లో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. యూపీలో కోవిడ్ కేసులు 11కి చేరడంతో మార్చి 22 వరకు కాలేజీలు, స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేరళలోని పత్తినంథిట్ట జిల్లాల్లో దాదాపు 900 మంది కరోనా అనుమానితులను స్వీయ నిర్బంధంలో ఉంచారు.
 
ఇకపోతే, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిద్‌ను ఓ మహమ్మారిగా ప్రకటించింది. దీని నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చింది. అలాగే, అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్లోనూ ఈ అంటువ్యాధి వేగంగా ప్రబలుతోంది.