1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 జులై 2021 (18:47 IST)

కోవిడ్‌తో భర్త మృతి-వీర్యం కోసం కోర్టును ఆశ్రయించిన వివాహిత

తన భర్త వీర్యం తనకు కావాలని ఓ వివాహిత హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం తక్షణమే అందుకు అంగీకరిస్తూ తీర్పు వెలువరించింది. హృదయాన్ని కదిలించే ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గతేడాది అక్టోబర్లో ఓ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే.. ఇటీవల ఆ మహిళ భర్త కరోనా బారిన పడ్డాడు. 
 
వడోదరాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమిస్తూ వస్తోంది. అతని శరీర అవయవాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. అతడు బతికేందుకు చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో తమ బంధాన్ని బిడ్డ రూపంలో సుస్థిరం చేసుకోవాలని ఆశించింది ఆ యువతి.. భర్త నుంచి సేకరించిన వీర్యం ద్వారా ఐవీఎఫ్ విధానంలో తల్లి కావాలని భావించింది. 
 
అయితే.. కొవిడ్తో బాధితుడైన సదరు వ్యక్తి నుంచి వీర్యాన్ని సేకరించేందుకు ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. న్యాయస్థానం ఆదేశిస్తేనే తాము అతడి వీర్యాన్ని సేకరిస్తామని చెప్పారు. దాంతో ఆ మహిళ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. 
 
మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ అశుతోష్ జే శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం.. సదరు కోవిడ్ బాధితుని నుంచి వీర్యాన్ని తక్షణమే సేకరించాలని ఆస్పత్రిని నిర్దేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దాన్ని తగిన విధంగా భద్రపరచాలని సూచించింది.