శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (17:52 IST)

కాంగ్రెస్ అధ్యక్ష పదవి వద్దు.. గాంధీ కుటుంబేతర వ్యక్తికి ఇవ్వండి .. రాహుల్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, సీడబ్ల్యూసీ మాత్రం ఆయన రాజీనామా లేఖను తోసిపుచ్చింది. 
 
ఈ నెల 23వ తేదీన వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఆత్మపరిశీలనలో మునిగితేలుతోంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ఇప్పటికే అనేక మంది రాజీనామాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాగా, ఇందులో రాహుల్ గాంధీ తన రాజీనామా లేఖను సమర్పించారు. 
 
ఇందులో రాహుల్ మాట్లాడుతూ, ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరవైఫల్యానికి కారణం తనదేనని చెప్పారు. అందుకే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ రాజీనామాను తిరస్కరించింది. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోవడం పట్ల తనదే నైతిక బాధ్యత అని రాహుల్ చెప్పడంతో మిగిలిన సభ్యులు దాన్ని తోసిపుచ్చారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షపదవిని గాంధీ కుటుంబేతర వ్యక్తికి ఇవ్వాలని రాహుల్ చేసిన ప్రతిపాదనను కూడా సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. 
 
కాగా, ఈ సమావేశానికి యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.