శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జులై 2024 (20:00 IST)

మేమంతా నరకంలో జీవిస్తున్నాం... సీజేఐకు సివిల్స్ విద్యార్థి లేఖ

delhi floods death
తామంతా నరకంలో జీవిస్తున్నామని, ఢిల్లీ మున్సిపల్ అధికారుల అవినీతి కారణంగా కోచింగ్ సెంటర్ల యజమానులు ఇష్టారాజ్యంగా నడుచుకుంటా యధేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఓ సివిల్స్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. 
 
ఢిల్లీలో సంభవించిన వరదల కారణంగా ముగ్గురు సివిల్స్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. నగర అధికారులు, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సివిల్స్‌ విద్యార్థి అవినాశ్ ధూబే ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోని లోపాలను ఎత్తి చూపుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌కి లేఖ రాశాడు.
 
'ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ విద్యనభ్యసించడమనేది మా ప్రాథమిక హక్కు. నీటి ఎద్దడి, వరదల కారణంగా విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లితోంది. మాకు సురక్షితమైన వాతావరణం అవసరముంది. అప్పుడే నిర్భయంగా చదువుపై దృష్టి సారించగలం. దేశ అభివృద్ధిలో భాగమవ్వగలం' అని పేర్కొన్నాడు.
 
తమతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేలవమైన మౌలిక సదుపాయల గురించి వెల్లడించాడు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వర్షాలు పడినప్పుడల్లా నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాడు. నిబంధనలను ఉల్లంఘించి బేస్‌మెంట్‌లను లైబ్రరీలుగా మార్చారని.. వారి నిర్లక్ష్యం వల్లే ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించాడు. తామంతా నరకంలో జీవిస్తున్నట్లు లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థుల మరణాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు.