ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 జులై 2024 (19:32 IST)

నీట్ యూజీ తుది ఫలితాలను వెల్లడించిన ఎన్టీయే.. సుప్రీం తీర్పు మేరకు సవరణ!!

neet exam
వైద్య విద్యా కోర్సు ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాలను మరోమారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) గురువారం వెల్లడించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సవరించిన ఫలితాలను విడుదల చేసింది. ఫిజిక్స్‌‍లో అడిగిన ఓ ప్రశ్నకు సంబంధించి పలువురు విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను తొలగించి, తాజా ఫలితాలను విడుదల చేశారు. 
 
నీట్ ప్రశ్నపత్రంలోని 29వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు కరెక్ట్ అని నీట్ ఇటీవల పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు నిపుణుల త్రిసభ్య కమిటీ ఆప్షన్ 4 సరైన సమాధానంగా పేర్కొంది. దాన్ని టిక్ చేసిన వారికే మార్కులు కేటాయించింది. ఈ యేడాది మే నెలలో నిర్వహించిన యూజీ ఎంట్రెన్స్ పరీక్ష తీవ్ర వివాదాస్పదమైన విషయం తెల్సిందే. 
 
ప్రశ్నపత్ర లీక్, కాపీయింగ్, మాస్ కాపీయింగ్ వంటి అంశాలు వెలుగుచూశాయి. పైగా, జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సిన ఈ ఫలితాలను జూన్ 4వ తేదీనే విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ ఫలితాల్లో 67 మందికి 720కు 720 మార్కులు రావడంతో వారంతా టాపర్లుగా నిలిచారు. ఇపుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ 67 మంది టాపర్లలో 44 మంది తమ ఫస్ట్ ర్యాంకును కోల్పోయారు.