1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (09:19 IST)

తాజ్‌ మహల్ షాజహాన్ నిర్మించలేదా? హిందూ మహాసేన పిటిషన్.. విచారణకు ఆదేశం

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. రాజా మాన్ సింగ్ ప్యాలెస్‌కు మార్పులు చేసి తాజ్‌ మహల్‌ను సిద్ధం చేశారంటూ ఆ పిల్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు ఈ విషయంపై భారత పురావస్తు శాఖ దృష్టిసారించాలని ఆదేశించింది. 
 
ఆగ్రాలోని తాజ్ మహల్ నిర్మాణం గత 1630-48 మధ్యకాలంలో జరిగింది. ఇది చరిత్ర చెబుతున్న విషయం. అయితే తాజ్‌ మహల్‌కు చెందిన చరిత్ర పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దాలంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 
 
ప్రస్తుతమున్న తాజ్ మహల్ ఒకప్పుడు రాజామాన్ సింగ్ ప్యాలెస్ అని, దానికి షాజహాన్ తన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశాడని పేర్కొంది. ఈ మేరకు చరిత్ర పుస్తకాల్లో తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
 
ఈ పిటిషన్‌పై జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ తుషార్ గెడెలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హిందూ సేన ఇదే తరహా పిటిషన్‌తో గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైనాన్ని ప్రస్తావించింది. కానీ, ఈ విషయంలో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంపై దృష్టిసారించాలని తాజాగా ఏఎస్ఐని కోరింది. 
 
కాగా, తాజ్మహల్ వయసు ఎంతో కూడా నిర్ధారించేందుకు ఏఎస్ఐ పరీక్షలు నిర్వహించాలని హిందూ సేన తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. తాజ్ మహల్ విషయంలో తాము లోతైన అధ్యయనం చేశామని, చరిత్ర పుస్తకాల్లో ఈ విషయమై ఉన్న తప్పులు సరిదిద్ది ప్రజలకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని అభిప్రాయపడింది. రాజా మాన్ సింగ్ ప్యాలెస్‌ను కూల్చి మొఘలులు తాజ్ మహల్ నిర్మించారనడానికి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని పేర్కొంది.